పాఠశాలల్లో ఆటల సందళ్లువిద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి నరసింహారావు అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం అచ్చంపేట జెడ్పి పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు పాఠశాల హెచ్ఎం సిహెచ్ కళ్యాణి తెలిపారు. పోటీలను నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సిహెచ్ నాగరాజు, అచ్చంపేట స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఎ.సుజాత, సత్యనారాయణ, కోసూరు స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీధర్, అమరావతి మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ అనురాధ పర్యవేక్షించారు.
ప్రజాశక్తి - మాచర్ల : స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీలకు పలువురు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ హనుమంతురావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడ అసక్తి చూపాలన్నారు. ఉన్నత విద్యలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలలో కూడ క్రీడలలో రాణించిన వారికి ప్రత్యేక కోట ఉంటుందన్నారు. విద్యార్థులతోపాటు పీడీ ఆంజయ్యను భినందించారు.
ప్రజాశక్తి-ఈపూరు : క్రీడాకారులు లక్ష్యాల సాధనకు కృషి చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ చుండు వెంకట్రావు అన్నారు. మండలంలోని ఎ.ముప్పాళ్ల గ్రామం ధనలక్ష్మి వ్యాయామ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలురు అండర్-17 విభాగంలో ఇ.గోపి (జెడ్పి పాఠశాల-బొగ్గరం), వి.యోహాను (జెడ్పి పాఠశాల-ఈపూరు), బాలికల విభాగంలో జె.వెంకాయమ్మ (జెడ్పి పాఠశాల-కొచ్చర్ల), వి.రోహిణి జెడ్పి పాఠశాల - ఎ.ముప్పాళ), బాలుర అండర్--14 విభాగంలో బి.మహేంద్ర (జెడ్పి పాఠశాల -ఎ.ముప్పాళ్ల), పి.పవన్ నరసింహ (జెడ్పి పాఠశాల-కొచ్చర్ల), బాలికల విభాగంలో కె.కర్మణి కావ్య (జెడ్పి పాఠశాల - ఈపూరు), ఎస్.అమృతవర్షిణి (జెడ్పి పాఠశాల - కొచ్చర్ల) విజేతలుగా నిలిచారు. పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు ఎ.వీరాంజనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, వైవి చిరంజీవి, కె.గోపి, కె.ఏసురాజు, ఎన్.వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.










