ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జిపిఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం రద్దు చేస్తామని గత ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు సిఎం జగన్ హామీ ఇచ్చారని, దాన్ని రద్దు చేయకుండా జిపిఎస్ ప్రవేశ పెట్టడం సరికాదన్నారు.పాత పెన్షన్ పథకం అమలు చేయకుండా ఇతర వేరే పెన్షన్ అమలుకు ఉద్యోగ ఉపాధ్యాయులు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాత పెన్షన్ అమలు జరిగేంత వరకు యూటీఎఫ్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎస్.బాలకృష్ణ, జిల్లా కౌన్సిలర్లు సుబ్బారావు, ఎస్.కన్నయ్య, సూర్యనారాయణ కోటేశ్వరరావు, మల్లికార్జున్, బాబ్జి, రామకృష్ణ పాల్గొన్నారు.
యుటిఎఫ్ జాతాను జయప్రదం చేయండి
పాడేరు:ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆవిర్భవించి 49 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ సంబరాల ప్రచార జాతాను జయప్రదం చేయాలని యుటిఎఫ్ అల్లూరి జిల్లా కార్యదర్శి వి.మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రచార జాతా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమై మన్యం జిల్లా పార్వతీ పురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో మీదుగా అల్లూరి సీతారామరాజు జిల్లా-పాడేరుకు 23న శనివారం మధ్యాహ్నం చేరుతుందని తెలిపారు. యుటిఎఫ్ సంఘ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యుటిఎఫ్ అల్లూరి జిల్లా సహా అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు, ప్రధాన వి.మహేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.కర్రిబాబు, ఎస్.గంగధర్ తదితరులు కోరారు.










