Apr 15,2023 00:41

ప్రజాశక్తి-పర్చూరు: విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ పిలుపు నిచ్చారు. పర్చూరు అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేపి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోపిదేపి వెంకటరమణ మాట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా జగన్‌ పాలన కొనసాగుతుందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పర్చూరులో ఆమంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారన్నారు. 175 నియోజకవర్గాల మీద పూర్తిగా పట్టు ఉందని, అందుకనే వైనాట్‌ 175 అంటున్నారని వివరించారు. సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యపడుతుందని బీద మస్తాన్‌రావు అన్నారు. పెద్దల సభకు ఏ రాజకీయ పార్టీ బీసీలను పంపలేదన్నారు. రాజ్యసభలో 9 స్థానాల్లో 4 స్థానాలను బిసిలకు కేటాయించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా పాలన సాగుతోందని అన్నారు. సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని టిడిపి వర్గీయులకు వత్తాసు పలకటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ చుండు సుజ్ఞానమ్మ, మండల కన్వీనర్‌ కఠారి అప్పారావు, తోకల కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైసిపి పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌