Jun 05,2023 21:14

భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హౌసింగ్‌ బోర్డు కాలనీలో చిల్డ్రన్‌ పార్క్‌ ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత, కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ ఇంజినీరు నాగభూషణం రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ రఘునాథ్‌ రెడ్డి శంకుస్థాపనకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్‌ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఎప్పటికప్పుడు మ్యాపింగ్‌ చేయించి రికార్డుల్లో పొందుపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. చిల్డ్రన్‌ పార్కులో పిల్లలకు కావాల్సిన పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణం చేపట్టి మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాంజల పార్కు, మహావీర్‌ కాలనీ పార్కు, ఎస్‌కెడి కాలనీ పార్కు, నేషనల్‌ స్కూల్‌ దగ్గర ఉన్న పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి వివరించారు. నాయకులు కామాక్షి తిమ్మప్ప, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ గౌస్‌, నాయకులు చంద్రకాంత్‌ రెడ్డి, అక్షరశ్రీ స్కూల్‌ రామకృష్ణారెడ్డి, అయ్యాలి, లక్ష్మీనారాయణ ఉన్నారు.