Jan 09,2023 23:37

తగరపువలసలో ర్యాలీ చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి-యంత్రాంగం
కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వానికి, యూనియన్‌కు మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికులు సోమవారం టోకెన్‌ సమ్మె నిర్వహించారు.
తగరపువలస : జివిఎంసి ఒకటో జోన్‌ పారిశుధ్య కార్మికులు యూనియన్‌ భీమిలి జోన్‌ కమిటీ ఆధ్వర్యాన స్థానిక యూనియన్‌ కార్యాలయం నుంచి వై జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్‌ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జోన్‌ కార్యదర్శి రవ్వ నరసింగరావు, నాయకులు సురేష్‌, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు
గాజువాక: గాజువాక జోన్‌లోని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య, నీటిసరఫరా, యుజిడి, వెటర్నరీ, ఇంజినీరింగ్‌, క్లాప్‌ డ్రైవర్స్‌ తదితర కార్మికులు విధులు బహిష్కరించారు. చెత్త తరలించే క్లాప్‌ వ్యానులు యార్డుకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం వరకు తాగునీటి పంపు వాల్స్‌ బంద్‌ చేశారు. ఈ నెల 12వ తేదీన చర్చలకు ఆహ్వానిచ్చినందున సాయంత్రం నుంచి పలుచోట్ల నీటిని సరఫరాచేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్లే పర్మిషన్‌ లేదంటూ యూనియన్‌ గాజువాక జోన్‌ ప్రధాన కార్యదర్శి గొలగాని అప్పరావును గాజువాక పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.
పిఎం పాలెం : జివిఎంసి జోన్‌-2 మధురవాడ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జోన్‌ కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు, క్లాప్‌ వాహన డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డ్రైవర్లు, విద్యుత్‌, యుజిడి, నీటి సరఫరా కార్మికులకు రిస్క్‌ అలవెన్సు ఇవ్వాలని, వారసత్వ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సిహెచ్‌.శేషు, జి.విజరు, పి.జాన్‌, బి.నర్సింగరావు, కె.అర్జునమ్మ, ఎస్‌.చిన్నాబాబు, కె.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.