ప్రజాశక్తి-విజయనగరం : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పార దర్శకంగా జరుగుతోందని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడే అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి. అనిత స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి సహేతుకమైన కారణాన్ని చూపుతున్నా మని, ఆ తర్వాతే ప్రక్రియను సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంటింటి సర్వే సజావుగానే జరిగిందని, గుర్తించిన సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపామని వివరించారు. ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై సమీక్షించే నిమిత్తం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. పలు పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు డిఆర్ఒ వివరించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ గురించి వెల్లడించారు. ఇంటింట సర్వేలో బిఎల్ఒలకు, బిఎల్ఎలను అనుసంధానం చేస్తామని, ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.










