Nov 02,2023 21:13

రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న తహశీల్దార్‌

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలోనూ పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించామని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం తహశీల్దార్‌ కార్యాలయంలో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, టిడిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్‌, జనసేన పార్టీ నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకులు అడిగిన ప్రతి విషయాన్ని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడా అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఓటరు జాబితాను తయారు చేశామన్నారు. ఓటరు జాబితాపై అనుమానాలుంటే వెంటనే తెలియజేయాలని కోరారు. మండలంలోని మొత్తం 23,713 మంది ఓటర్లు ఉండగా మహిళలు 11,881, పురుషులు 11,832 ఉన్నట్లు తెలిపారు. ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, వైసిపి కన్వీనర్‌ జూటూరు మారయ్య, టిడిపి కన్వీనర్‌ లాయర్‌ షేక్షావలీ, మాజీ జడ్‌పిటిసి మీనాక్షి నాయుడు, మాజీ వైస్‌ ఎంపిపి వెంకటేశులు, కాంగ్రెస్‌ నాయకులు వినోద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మధు స్వామి పాల్గొన్నారు.