పాలకుల విధానాల వల్లే ధరల పెరుగుదల
- నేటి నుంచి 5 వరకు ఆందోళనలు : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణం అని సిపిఎం సీనియర్ నాయకులు ఏ. రాజశేఖర్, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్లు అన్నారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4 సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే సమరభేరి పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలో గత రెండు నెలల కాలంలో బియ్యం కేజీకి రూ.12 వరకు పెరిగిందని, కూరగాయలు మొదలు నిత్యవసరాలు వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరిగినా కేంద్ర ప్రభుత్వం జిఎస్టితో మరింత భారం వేయటం దారుణం అన్నారు. దేశ వ్యాప్త ఆందోళనలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాబాష, ఏ. సురేంద్ర, ఎన్. స్వాములు, పి. సుధాకర్,డి. రామ్ నాయక్, వీరన్న, టి.శివకుమార్, శివుడు తదితరులు పాల్గొన్నారు. మిడుతూరు : సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల నాయకులు ఓబులేసు, లింగస్వామి, తదితరులు గోడపత్రికలను విడుదల చేశారు. నందికొట్కూరు టౌన్ : ఈనెల 30వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ చేపట్టిన సిపిఎం సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పి పకీరు సాహెబ్, టి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో సమరభేరి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సిఐటియు నాయకులు సి నాగన్న, భాస్కర్, ప్రజలు శ్రీనివాసులు, జీవన, బొజ్జన్న, లాల్, మహమ్మద్ రఫీ, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ : ప్రస్తుత పాలనలో ఆకాశాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలేనని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నిపాటి చిన్న మారెన్న, శాఖ కార్యదర్శి మల్లికార్జున అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సమరభేరి పోస్టర్ ఆవిష్కరించారు. సిఐటియు శ్రీశైలం మండల అధ్యక్షులు దర్శనం, నాగరాజు, సిపిఎం శాఖ కార్యదర్శి నాగ వెంకటేశ్వర్లు, జి.మల్లికార్జున సభ్యులు ఏ. రాము, రంగస్వామి, ప్రభాకరు,భీమలింగడు, పెద్ద గంగులు, చిన్న వెంకటనా రాయణ, చిన్న గంగులు తదితరులు పాల్గొన్నారు.










