ప్రజాశక్తి -అనకాపల్లి : 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ కోరారు. ఆదివారం మండలంలోని సత్యనారాయణపురం, మూలపేట గ్రామాలతోపాటు, జివిఎంసి పరిధిలోని ఎఎంసి కాలనీ సచివాలయాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. సచివాలయంలో ఉన్న విఆర్ఒలు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. మండలంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు జరుగుతోందని, కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటర్ల జాబితాలో సవరణకు అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లోనూ ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. డిటి శ్రీరామమూర్తి, ఆర్ఐ రమేష్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.
గొలుగొండ: మండలంలో బిఎల్ఓలు కొత్త ఓటర్ల నమోదును ఆదివారం నిర్వహించారు. ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామంలో ఓటర్ల నమోదు ప్రక్రియను తహశీల్దార్ ఆనందరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక క్యాంపు నిర్వహణలో భాగంగా కొత్త ఓట్లను నమోదు చేయడం, ఓటర్ జాబితాలో సవరణలు బిఎల్వోల ద్వారా చేపడు తున్నామన్నారు. అర్హులు ఎవరైనా ఉంటే వెంటనే బిఎల్ఓలను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, వీఆర్వో శ్రీధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మాకవరపాలెం: మండలంలో ఆదివారం కొత్త ఓటర్ల నమోదుకు పలు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రసాదరావు మాట్లాడుతూ, 18 సంవత్సరముల నిండిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉన్న స్థానిక బిఎల్ఓలకు దరఖాస్తు అందజేయాలని ఆయన తెలిపారు. అనంతరం మాకవరపాలెం, తామరం, కొండల అగ్రహారం, లచ్చన్న పాలెం, పైడిపాల తదితరు గ్రామాల్లో ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.










