Sep 20,2023 22:09

సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి మడకశిర : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యుటిఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో చర్చలు జరపకుండా, సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ను మంత్రివర్గం ఆమోదించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ జిపిఎస్‌ విధానం కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టపరిచే విధానమే అని అనారు. దీనిని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్‌- జిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారము పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, జిల్లా కార్యదర్శి తాహెర్‌ వలి, ఈశ్వర, సుదర్శన్‌, నరసింహమూర్తి, మాలింగప్ప, కదురప్ప, నంజన్న, వెంకటరమణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్‌ నాయకులు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, భార్గవ, సుధాకర్‌, నాగేంద్ర, ఆసిఫ్‌, ఫయాజ్‌, మధుసూదన్‌, రాజేష్‌, అల్లాబకాష్‌, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.