
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక నిరాహార చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట గురువారం ప్రారంభమైన ఈ దీక్షలను ఎపిజెఎసి జిల్లా ఛైర్మన్ జె.మురళి దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒపిఎస్ అమలు విషయంలో ఉద్యోగులను మోసం చేసిందన్నారు. 2004లో పెన్షన్ విధానం రద్దు చేసినప్పటి నుండి దేశవ్యాపితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు సంవత్సరాలుగా ఉద్యమం సమరశీలంగా నడుస్తున్నదని అన్నారు. సిపిఎస్ను రద్దు చేస్తానని గత ఎన్నికల సందర్భంగా జగన్మోమహన్రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయకుండా మోసం చేయడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. సిపిఎస్ రద్దుకు చేస్తున్న పోరాటం న్యాయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, ఈ ఆందోళనకు అన్ని సంఘాలు మద్దతు తెలపాలని అన్నారు. అనంతరం యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, జె ఎవిఅర్ కె ఈశ్వరరావు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఐదేళ్లు అవుతున్నా రద్దు చేయకుండా జిపిఎస్ పేరుతో ఉద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. జిపిఎస్ మా కొద్దని, ఒపిఎస్ అమలు చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వకుండానే సిపిఎస్ ను రద్దు చేసి ఒపిఎస్ను అమలు చేస్తున్నాయన్నారు. లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నా ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నిరవధిక దీక్షలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, రాష్ట్ర కౌన్సిలర్ కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, జెఎవిఅర్కె ఈశ్వరరావు, సిహెచ్ తిరుపతి నాయుడు, యుటి ఎఫ్ సిపిఎస్ విభాగం జిల్లా కన్వీనర్ పి.రామ్ ప్రసాద్ కూర్చున్నారు. వారికి మద్దతుగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సత్య శ్రీనివాస్, కె.ప్రసాదరావు, రాజారావు, త్రినాధరావు, రాధాభవాని, భాస్కరరావు పాల్గొన్నారు.

దీక్షకు ఉపాధ్యాయ, ప్రజాసంఘాల మద్దతు
నిరవధిక దీక్షకు ఎపిటిఎఫ్ నాయకులు డి.ఈశ్వరరావు, పైడిరాజు, ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, బిటిఎ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, జెవివి నాయకులు జి.నిర్మల, సిఐ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, జిల్లా నాయకులు వి.లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు నాయకులు కె.సురేష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, అపార్ట్మెంట్ కాలనీ వాసులు అసోసియేషన్ నాయకులు యుఎస్ రవికుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు జరగాలంటే అధి ఉద్యోగులు వలనే సాధ్యమన్నారు. ఉద్యోగ, ఉపాద్యాయులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. తక్షణమే సిపిఎస్, జిపి ఎస్ ను రద్దు చేసి, ఒపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం జరిగే పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు అండగా ఉంటామని తెలిపారు.
