ప్రజాశక్తి -మధురవాడ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎమ్.శరత్చంద్రబాబు మాట్లాడుతూ శీతలయంత్రాల కారణంగా ఓజోన్ పొర దెబ్బతిని మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందన్నారు. నానోటెక్నాలజీ ఆధారంగా వాతావరణ మార్పులకు కళ్ళెం వేయవచ్చునన్నారు. గీతం పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వి.సరిత మాట్లాడుతూ ఓజోన్ పొర నాశనమైతే, అతి నీలలోహిత కిరణాలు భూమిని తాకి జీవరాశుల ఉనికిని ప్రశ్నార్థకమౌతుందన్నారు. సీనియర్ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ మాంట్రియల్ ఒప్పందాన్ని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించడానికి ప్రజలు, ప్రభుత్వాలు అవగాహనతో ముందుకు సాగాలన్నారు.కార్యక్రమంలో విద్యార్థులు , అధ్యాపకులు , పరిశోధుకులు పెద్దఎత్తున పాల్గోన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసారు.
ములగాడ: శ్రీహరిపురంలోని జివిఎంసి పాఠశాలలో రాష్ట్ర సాంకేతిక మండలి సౌజన్యంతో ప్రపంచ ఓజోన్డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు.హెచ్ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ ఓజోన్ పొర ఆవశ్యకతను వివరించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆచారి, విజయకుమార్, పద్మజ, స్వప్న ,లక్ష్మీ, ప్రకాష్ పాల్గొన్నారు.










