
జూబ్లీహిల్స్ : సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక భర్త చైతన్యపై అపార్టుమెంట్ అసోసియేషన్ వారు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోసియేషన్కు చెందిన కొందరు తమ ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించారని చైతన్య ఫిర్యాదు చేశారు. అయితే, ప్రస్తుతం వీరిమధ్య రాజీ కుదిరింది. వివరాల్లోకి వెళితే.. షేక్పేట ప్రాంతంలో ఉన్న టాన్సికా అపార్టుమెంట్లో ఫ్లాట్ను గతేడాది మార్చిలో నిహారిక అద్దెకు తీసుకున్నారు. ఫ్లాట్ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారని, తద్వారా చాలామంది వచ్చి వెళుతున్నారని, కరోనా నిబంధనలకు విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని టాన్సికా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము అద్దెకు తీసుకున్న సమయంలోనే ఇంటి యజమానికి ప్రొడక్షన్ కార్యాలయం విషయం తెలియజేశామంటూ నిహారిక భర్త చైతన్య విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 2న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దాదాపు 20 నుంచి 25 మంది అసోసియేషన్కు చెందిన వారు తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. ఈ వివాదంపై ఇంతవరకు ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర చెప్పారు. ఈ నేపథ్యంలో తమ మధ్య రాజీ కుదిరిందని చైతన్య తాజాగా ఒక వీడియోలో తెలిపారు.