చెన్నై : ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్తో పాటు పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, పబ్లు వంటి పలు వ్యాపారాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార కొత్త బిజినెస్లో అడుగుపెట్టింది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ 'చాయ్ వాలే'లో ఆమె పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థకు రూ.5 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇందులో నయన్, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. 'చాయ్ వాలే' బిజినెస్ విషయంలోకి వెళ్తే.. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫంక్షనల్ స్టోర్లను తీసుకొస్తోంది. ఏడాది లోపల పూర్తిగా పని చేసే 35 స్టోర్లను తెరవాలనేది కంపెనీ ప్రణాళిక అని సమాచారం. ఈ సంస్థలో పలువురు సినీ ప్రముఖులు పెట్టుబడి పెట్టారు. ఇదిలా ఉండగా, నయన్, విఘ్నేశ్ కాంబినేషన్లో ప్రస్తుతం 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమా తెరకెక్కుతోంది.