Oct 30,2022 00:09

సమావేశంలో పాల్గొన్న విసి సూర్యప్రకాష్‌ తదితరులు

ప్రజాశక్తి- సబ్బవరం
ఉత్తరాంధ్రలోని న్యాయ కళాశాలల్లో న్యాయవిద్యలో నైపుణ్యం, నాణ్యత పెంపొందించేందుకు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డిఎస్‌ఎన్‌ఎల్‌యు) కృషి చేస్తుందని వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్‌.సూర్యప్రకాష్‌ అన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన న్యాయ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సెక్రటరీలు/కరస్పాండెంట్‌లతో శనివారం డిఎస్‌ఎన్‌ఎల్‌యు ఆచార్య సూర్యప్రకాష్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి సమీక్షించారు. న్యాయ కళాశాలల అధ్యాపకుల ప్రయోజనం కోసం డిఎస్‌ఎన్‌ఎల్‌యులో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని, వారిని ఇక్కడ నిర్వహించే విద్యా కార్యక్రమాలకు ఆహ్వానించాలని, వర్సిటీ ఫ్యాకల్టీ కూడా కళాశాలల విద్యార్థులకు కొన్ని తరగతులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దయానంద మూర్తి, ప్రొఫెసర్‌ పి.శ్రీసుధ, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం కళాశాలల ప్రిన్సిపాళ్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.