ప్రజాశక్తి -కొత్తకోట:నూతన విద్యా విధానంలో ప్రవేశ పెడుతున్న విధానాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని యలమంచిలి డిప్యూటీ డిఈఓ ప్రేమ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం ఆయన మండలంలో జెడ్.కొత్తపట్నం, రావికమతం బాలికల హైస్కూల్, గర్ణికం కేజీబీవీ పాఠశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో అమలవుతున్న లిప్ ( లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం), పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతకు తీసుకోవలసిన చర్యలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అంతకుముందు జెట్ కొత్తపట్నం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్నదీ లేనది తనిఖీ చేశారు. వంద రోజుల లిప్ ప్రోగ్రాం పై విద్యార్థులు ఇంతవరకు సాధించిన ప్రగతి, ఎనిమిదవ తరగతి విద్యార్థులకి ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబల ద్వారా బైజుస్ యాప్ లో పాఠాలపై సమీక్షించారు.










