Feb 21,2023 23:21

సిఎమ్‌డి అతుల్‌భట్‌కు వినతిని అందిస్తున్న అయోధ్యరామ్‌ తదితరులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : కార్మికులకు నూతన వేతనాలు అమలుచేయాలని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి తగు సూచనలతో కూడిన ఆదేశాలను ఇవ్వాలని ఎన్‌జెసిఎస్‌ కన్వీనర్‌కు స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి లలిత్‌ మిశ్రా రాసిన లేఖను సిఎమ్‌డి అతుల్‌భట్‌కు స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రతినిధులు మంగళవారం అందించారు. లేఖలో లలిత్‌మిశ్రా పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి... 'దేశవ్యాప్తంగా స్టీల్‌ కార్మికులకు అక్టోబర్‌ 21 నూతన వేతన ఒప్పందం జరిగింది. ఒప్పంద సమయంలో ఎన్‌జెసిఎస్‌ కన్వీనర్‌గా మీరు ఉన్నారు. ఎన్‌జెసిఎస్‌లో భాగస్వామ్యంగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులకు నూతన వేతనాలు ఇంత వరకు అమలు చేయలేదు. దీనిపై కన్వీనర్‌గా మీరు దృష్టి సారించి తక్షణం సమస్యను పరిష్కరించాలి' అని కోరుతూ లేఖ విడుదల చేశారు.
ఈ లేఖను సిఎమ్‌డికి ఆయన కార్యాలయంలో అందించిన అనంతరం స్టీల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, కార్మికులు అంకిత భావంతో పనిచేసి ఉత్పత్తిలో రికార్డులను సృష్టిస్తున్నారని తెలిపారు. తద్వారా పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన వెసులుబాటు ఉందని తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టి కార్మికులను ఉత్సాహపరిస్తే ఉత్పత్తి, ఉత్పాదకతలలో కార్మికుల సామర్థ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి య. రామస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన నూతన పెన్షన్‌ విధానంపై కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, దీనికి నూతన వేతన ఒప్పందం అమలు కాకపోవడం వల్ల తీవ్ర నష్టానికి గురి అవుతున్నారని వివరించారు. కార్మికుల ఆర్థిక నష్టాలను తగ్గించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ, సెయిల్‌లో కార్మికుల నూతన వేతన ఒప్పందం అమలుతో పాటు బకాయిలను కూడా సెయిల్‌ యాజమాన్యం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను, అధికారులకు ప్రోత్సహించేందుకు యాజమాన్యం కృషిచేయాలని కోరారు.
స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌భట్‌ మాట్లాడుతూ, స్టీల్‌ కార్మికులు కృషి వల్ల నేడు ఉత్పత్తి, ఉత్పాదకతలు రికార్డు స్థాయిలో వస్తున్నాయని, తద్వారా పరిశ్రమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా ఉందని తెలిపారు. ఈ విషయంపై స్టీల్‌ అధికారులతో చర్చిస్తానని చెప్పారు.