Feb 06,2023 23:53

36 గంటల దీక్షలో కూర్చున్న ఎఐటియుసి, మిత్రపక్షాల నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు నూతన వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ, మిత్రపక్షాల యూనియన్లు ఆధ్వర్యాన ఉక్కునగరం పరిపాలన విభాగం వద్ద 36 గంటల నిరాహార దీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ, నూతన వేతన ఒప్పందం అమలుచేయడంలో ఉక్కు యాజమాన్యం విఫలమైందన్నారు. యాజమాన్యం నిర్లక్ష్య చర్యల వల్ల జూనియర్‌ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఉక్కు కర్మాగారం నష్టాల పేరుతో ప్రయివేటీకరణ చెయ్యాలని చూస్తుందని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నిరాహార దీక్షలో యూనియన్‌ నాయకులు కె.శ్రీనివాసరావు, విళ్లా రామ్మోహనరావు, పి.పెంటారావు, సోమునాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.