Sep 13,2023 21:34

ఫొటో : పెన్షన్‌ను అందజేస్తున్న జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలకీë

నూతన పెన్షన్లు పంపిణీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని అప్పారావుపాలెం సచివాలయంలో కొత్తగా మంజూరైన వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆత్మకూరు జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మీ విచ్చేసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు, పంపిణీలో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచిందని ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు. అప్పారావుపాలెం సచివాలయంలో గడపగడకు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి దృష్టికి గ్రామంలోని పలువురు తమకి అర్హత కలిగి ఉన్నప్పటికీ తమకు పెన్షన్‌ రావడం లేదని తెలియజేయడం వల్ల వెంటనే ఆ దరఖాస్తులు పరిశీలించి పెన్షన్‌ మంజూరు చేయవలసిందిగా గతంలో కోరి ఉన్నారని తెలిపారు.
ఇప్పుడు ఆ దరఖాస్తుదారులు అందరికీ ప్రభుత్వ వారు పెన్షన్‌ మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు తీసుకున్న లబ్దిదారులు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డికి సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్‌ హజరత్‌ నాయుడు, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, సచివాలయ సిబ్బంది వేణు, శ్రీలేఖ, వెంకటేశ్వర్లు, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.