నూతన భవనంలోకి బాలాజీ హాస్పిటల్స్ నూతన ల్యాబ్తో డయాబెటిక్ సెంటర్ ప్రారంభించిన ఎంఎల్ఎ, మేయర్

ప్రజాశక్తి - భవానీపురం : స్థానిక భవానీపురం స్వాతి థియేటర్ రోడ్డులో నూతనంగా నిర్మించిన భవనంలో బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటిస్ సెంటర్ సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని నూతన భవనంలో ఏర్పాటు చేసిన బాలాజీ హిస్పటల్స్, డయాబెటిక్ సెంటర్ను దసరా పండుగ విజయదశమి రోజున సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలతో గొల్లపూడి, భవానీపురం, వన్టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి 50 పడకలతో ఆస్పత్రి నిర్మించి, వైద్య సేవలు అందుబాటులోకి తేవటం అభినందనీయమన్నారు. హాస్పిటల్ నిర్వాహకులు, ప్రముఖ డయాబెటిక్ వైద్యులు డాక్టర్ ఆర్ఎల్ వి. ఫణికుమార్, డాక్టర్ డి.అనూష మాట్లాడుతూ సొంత భవనం నిర్మాణం ద్వారా ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. గతంలో కన్నా మరిన్ని ఎక్కువ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ నూతన భవనంలోకి హాస్పిటల్ను మార్చినట్లు తెలిపారు. అతి తక్కువ ధరతో కంప్లీట్ హెల్త్ చెకప్ సేవలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. త్వరలోనే 24 గంటల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అత్యంత ఆధునీకరమైన పరికరములతో విజయవాడలో మొదటిసారిగా త్వరలో రోచ్ సి 311, ఈ 411 అనలైజర్స్, సిమెన్స్సెంట్యూర్ సిపి అనలైజర్లు, మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజలు తమ వైద్య సేవలు అందిపుచ్చుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పలువురు డాక్టర్లు, అభిమానులు, కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎం.డి. ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి తదితరులు పాల్గొని డాక్టర్లు ఫణికుమార్, అనూషలకు అభినందనలు తెలియజేశారు.