Aug 06,2021 17:06

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డును.. ధ్యాన్‌ చంద్‌ అవార్డుగా పేరు మారుస్తూ శుక్రవారం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. మోడీ ట్వీట్‌పై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు విమర్శిస్తూ వరుసగా ట్వీట్స్‌ చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీ పేరుతో ఉన్న క్రికెట్‌ స్టేడియం పేరును కూడా మార్చాలని సోషల్‌మీడియాలో ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దీనిపై గుజరాత్‌ ప్రతిపక్ష నేత శంకర్‌సింగ్‌ వాఘేలా నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా మార్చాలి అని ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పటాన్‌ భవిష్యత్తులో క్రికెట్‌ స్టేడియంలకు క్రీడాకారుల పేర్లే ఉంటాయని ఆశిస్తున్నా అని ట్వీట్‌ చేశారు. ఇంకొకరు 'స్టేడియంలకు ఉన్న అన్ని రాజకీయ నాయకుల పేర్లను మార్చాలి' అంటూ యూట్యూబర్‌ ధృవ్‌ రథీ ట్వీట్‌ చేశారు.