ప్రజాశక్తి-బాపట్ల: గోదావరి తీరం రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా పసుపు వర్ణ శోభిత మహానాడు నిర్వహణకు తమవంతు భూమిక నిర్వర్తించిన బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వేగేశన నరేంద్రవర్మను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఘనంగా సన్మానించారు. మహానాడు నిర్వహణలో అన్ని విధాల సహకరించి పార్టీ పటిష్ఠతకు రూ.5 లక్షలు విరాళాన్ని నరేంద్రవర్మ అందజేశారు. ఈ సందర్భంగా మహానాడులో ఏర్పాటు చేసిన విందుకు నరేంద్రవర్మను ప్రత్యేకంగా ఆహ్వానించి చంద్రబాబు నాయుడు ఆయనను దుశ్శాలువతో సన్మానించి అభినందించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుకు నరేంద్రవర్మ శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గం నుంచి రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుకు హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నరేంద్రవర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










