ప్రజాశక్తి-అద్దంకి: అభినవ సూరన గాడేపల్లి సీతారామమూర్తి స్మారక సృజన సాహిత్య పురస్కారం-2021 ప్రముఖ కథకులు ఆచార్య మధురాంతకం నరేంద్రకు శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కమఠేశ్వరస్వామివారి ఆలయంలో ప్రదానం చేశారు. గాడేపల్లి సీతారామమూర్తి కుమారులు డాక్టర్ చంద్రదత్, దివాకరదత్ పురస్కార ప్రదాతలు మధురాంతకం నరేంద్ర రచనలపైన ఆర్ రాఘవరెడ్డి, పాలపర్తి జ్యోతిష్మతి ప్రసంగించారు. సభకు గాడేపల్లి దివాకరదత్ అధ్యక్షత వహించారు. సభలో ఆత్మీయ అతిథి ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మనోధర్మ పరాగం నవలా శిల్పం అత్యద్భుతమని, ఇలాంటి శిల్పంలో తెలుగులో నవలలు రాలేదని రాఘవరెడ్డి అన్నారు. మధురాంతకం నరేంద్ర కథలన్నీ మనలని ఆలోచనలలోకి నెట్టేస్తాయని, మనిషి కోసం పలవరించే మంచి కథలు రచించినవారు మధురాంతకం నరేంద్ర జ్యోతిష్మతి అన్నారు. నరేంద్ర రచనలన్నింటి లోనూ శిల్పం తననాకర్షిస్తుందని, అన్ని రచనలలోనూ పూదండలో దారంలా మానవతావాదం తన కగుపించిందని దివాకరదత్ అన్నారు. సుప్రసిద్ధ సాహిత్య వేత్తలను సన్మానించటం తమ అదృష్టమని అవార్డు ప్రదాత చంద్రదత్ అన్నారు.










