ప్రజాశక్తి -గాజువాక : నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు నో ఎంట్రీ సమయపాలనను తప్పకుండా పాటిస్తామని విశాఖపట్నం ఆయిల్ ట్యాంక్ ట్రక్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ వెనుక యజమానులకు, డ్రైవర్లకు నో ఎంట్రీ సమయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పరిధిలోకి ఎంట్రీకాకుండా పోలీస్ కమిషనర్ సూచించిన సమయాలను పాటించి సహకరిస్తామన్నారు. మల్కాపురం ట్రాఫిక్ సిఐ తులసీదాస్ మాట్లాడుతూ, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలు రాకపోకలు చేయకూడదని, దీనికి సహకరించాలని కోరారు. నిత్యావసరాలు సంబంధించిన భారీ వాహనాలను, ఆయిల్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపారు. నగర పరిధిలో భారీ వాహనాలు ఒకదానినొకటి ఓవర్ టెక్ చేయరాదన్నారు. గాజువాక ట్రాఫిక్ సిఐ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, వాహనాలు నడిపేటప్పుడు అద్దాలు సరిగ్గా ఉండేటట్లు డ్రైవర్లు చూడాలని సూచించారు. సైడ్ అద్దాలు కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సిగల్ జంపింగ్ చేయరాదని కోరారు.










