Nov 20,2023 00:14

మాట్లాడుతున్న డిఎస్‌పి సుబ్బరాజు

ప్రజాశక్తి -కొత్తకోట:కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధి మర్రివలస గ్రామానికి చెందిన దళిత యువకుడు వారా కన్నయ్య (నాయుడు)పై హత్యాయత్నం కేసులో ప్రమేయం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని అనకాపల్లి డిఎస్పి సుబ్బరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం కొత్తకోట సర్కిల్‌ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మర్రి వలస గ్రామంలో ఈ నెల 16న సుమారు 9 గంటల సమయంలో ఇదే గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి వంశీకృష్ణ, వారా కన్నయ్యల సెల్‌ ఫోన్‌ చోరీ విషయమై తగదా పడ్డారన్నారు. ఈ తగాదాలో వంశీ కృష్ణ అప్పటికే కత్తిని సిద్ధం గా ఉంచడంతో పాటు మరో ముగ్గురు ఎలిసెట్టి రాముడు, ఎలిసెట్టి వరాల బాబు, ఊసి మహేష్‌ లను కూడా సిద్ధం చేసాడని, వీరంతా కలసి కన్నయ్య పై దాడి చేశారన్నారు. ఈ దాడిలో కన్నయ్య కు తీవ్ర గాయాలు కాగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు. సమాచారం తెలుసుకున్న కొత్తకోట ఎస్సై లక్ష్మణ రావు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఆటో డ్రైవర్‌ సహకారంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారన్నారు.కన్నయ్య సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారని డిఎస్‌పి పేర్కొన్నారు. నిందితులపై హత్య నేరంతో పాటు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని చెప్పారు. బాధితుని కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు గ్రామంలో ఎటువంటి అలజడలు చోటు చేసుకోకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని డిఎస్‌పి సుబ్బరాజు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌, ఎస్‌ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.