ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేట్ ఆసుపత్రులపై పాస్ చేసిన రైట్ టు హెల్త్ బిల్ ను తక్షణమే రద్దు చేయాలంటూ నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ, మార్చి 27 బ్లాక్ డేగా పాటిస్తున్నామని అన్నారు. రైట్ టు హెల్త్ బిల్లు దారుణమని ఈ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ కేస్ అని డాక్టర్లు నిర్ధారించాలని, వచ్చిన పేషెంట్ ఎమర్జెన్సీ అని ఎలా నిర్ధారించగలరన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి కేసు ఎమర్జెన్సీ గానే ఉంటుందని, తక్షణమే బిల్లు రద్దు చేయకపోతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనల మేరకు రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ హను తేజ్, నర్సీపట్నం సీనియర్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.










