Sep 09,2023 21:30

నిరసనాగ్రహం

టిడిపి అధ్యక్షులు చంద్రబాబును అరెస్టు చేయడంపై నిరసనాగ్రహం పెల్లుబికింది. నంద్యాల జిల్లా కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో భాగంగా పోలీసులు అరెస్టు చేశారు. కడప, అన్నమయ్య జిల్లా ల వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మండలాల నుంచి నియోజకవర్గాలు, జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు, బైక్‌ ర్యాలీలు చేపట్టాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులైన నిరసనలు, ధర్నాలు, బైక్‌ర్యాలీలు, రాస్తారోకోలపై నిర్భందాన్ని ప్రయోగించడం విస్మయాన్ని కలిగించింది. జిల్లాల్లో టిడిపి శ్రేణులు పెద్దఎత్తున చేపట్టిన నిరసనలు చేపట్టడంతో ఉదయం కొంతసేపు నెల కొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రాకపోకలను నిలిపేశారు. ముందుజాగ్రత్తల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపేసింది. ఊహించని రాజకీయ పరిణామాలతో ఆర్టీసీ రాకపోకల నిలిపేయడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం గమనార్హం. తర్వాత యధాతధంగా బస్సు సర్వీసులు నడిచాయి.
ప్రజాశక్తి - కడప ప్రతినిధిఎక్కడిక్కడే అరెస్టులు
కడప, అన్నమయ్య జిల్లాలో నిరసనలు చేపట్టిన టిడిపి నాయకులను ఎక్కడిక్కడే పోలీసులు అరెస్టులు చేశారు. కొందరిని ఇంటి దగ్గర, మరికొందరిని కార్యాలయాల దగ్గర, మిగిలిన వారిని ధర్నాలు, రాస్తారోకోలు, బైక్‌ర్యాలీల ప్రదేశాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. శనివారం ఉదయం ఏడు గంటలకే టిడిపి నాయకులు, కార్యకర్తలు నిరసనలు, రాస్తారోకోలు, బైక్‌ ర్యాలీలు, ధర్నాలతో వాతావరణం వేడెక్కింది. ఇందులో ప్రధానంగా కడప జిల్లా కేంద్రం లో ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ధర్నా చేపట్టారు. కమలా పురం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి వంటి కీలక నాయకుల్ని ముందస్తు అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
నిరసనల జోరు
కడప, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా నిరసనల జోరు మిన్నంటింది. కడప జిల్లాలో బద్వేల్‌లో యువ నాయకుడు రితేష్‌, మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు మండల కేంద్రాలు సహా పలు మండల కేంద్రాల్లో నిరసనలు మిన్నంటాయి. యర్రగుంట్ల, ముద్దనూరు, వేంపల్లి తదితర మండలాల్లో నిరసనలు, ధర్నాల పర్వం కొనసాగింది.
హౌస్‌ అరెస్టుల్లో నాయకులు
కడపలో అమీర్‌బాబు, పులివెందులలో బి.టెక్‌ రవి, మైదుకూరులో పుట్టా సుధాకర్‌యాదవ్‌లను హౌస్‌అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రసాద్‌బాబును టిడిపి కార్యాలయానికే పరిమితం చేశారు. రాజంపేట, నందలూరుల్లో మేడా విజయశేఖర్‌రెడ్డి, రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టాయి.
ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నాయకులు అరెస్టు
కడప అర్బన్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ఎన్టీఆర్‌ కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి సిఎం జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు బాలిశెట్టి హరిప్రసాద్‌, గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలన్నదే జగన్‌ వక్రబుద్ధి అని మండిపడ్డారు. 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్య మంత్రిగా రాష్ట్ర అభివద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన చంద్రబాబును కుటిల రాజకీయాలతో జగన్‌ పోలీసులతో అరెస్టు చేయించడం ప్రజా స్వామ్యానికే సిగ్గుచేటని పేర్కొన్నారు. అరెస్టులతో అడ్డుకోవాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రజలు అండగా నిలుస్తారని హెచ్చరించారు. ముందస్తు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కాసేపు వాగిద్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ముకుమ్మడిగా హరి ప్రసాద్‌, గోవర్ధన్‌ రెడ్డి , పీరయ్య , నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, యాదగిరి రాంప్రసాద్‌, సుధాకర్‌ యాదవ్‌ను అరెస్టు చేసి పోలీసు వాహనంలో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.
ఒంటిమిట్టలో.. తెలు గుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మండల టిడిపి నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో కడప చెన్నై జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసిన పలువురు టిడిపి నాయకులను అరెస్టు చేశారు. చింతకొమ్మదిన్నె : అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం ఖూనీ చేస్తుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక ఇర్కాన్‌ సర్కిల్‌ సెంటర్‌లో శనివారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి నరసింహారెడ్డితో సహా కార్యకర్తలను నాయకులు అరెస్టు చేసి కొద్దిసేపు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోరుమామిళ్ల టౌన్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమ పద్ధతిలో అరెస్టు చేయించడం అనైతిక చర్య అని తెలుగుదేశం పార్టీ నేతలు రంతు, యనమల సుధాకర్‌, భైరవప్రసాద్‌, సుబ్బారావు, శేట్టెంప్రతాప్‌, రామసుబ్బారావు, ఇమామ్‌ హుస్సేన్‌, సీతా వెంకటసుబ్బయ్య, గురివిరెడ్డి పేర్కొ న్నారు. పట్టణంలో కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాలకు చెందిన టిడిపి నాయకులు నల్ల రిబ్బన్ల తో నిరసన తెలిపారు. వేంపల్లె: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని ఆ పార్టీ మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి ఖండించారు. టిడిపి కార్యాలయంలో ఉన్న టిడిపి మండల కన్వీనర్‌ రామమునిరెడ్డి, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌ను వేర్వేరుగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రామమునిరెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున సిబిసిఐడి పోలీసులు అరెస్టు చేసిన విధానం సరైంది కాదని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అన్యాయం, దుర్మార్గమన్నారు. జగన్‌ రాజకీయ కక్ష సాధింపునకు ఇది పరాకష్ట అన్నారు. సింహాద్రిపురం : మాజీ సిఎం చంద్రబాబు అరెస్టు దుర్మార్గమైన చర్యని పులివెందుల టిడిపి నియోజవర్గ ఇన్‌ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి) పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జైల్లో 16 నెలలు చిప్పకూడు తిన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్‌ చేయించారన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టిడిపి నాయకులు ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్‌ చేయ డాన్ని టిడిపి ఖండిస్తోందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి రోని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు సిఎం సురేష్‌ నాయుడు, ముక్తియార్‌, నల్లబోతుల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో అల్లర్లు జరగకుండా ముందస్తుగా పోలీసులు వీరిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ విగ్రహం వద్ద నుండి శివాలయం సర్కిల్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసన చేశారు. ఖాజీపేట : 14 ఏళ్లు ముఖ్య మంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న చంద్ర బాబును ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం చూస్తే ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్‌ రాజ్య మా? రౌడీ రాజ్యమా? అర్థం కావడంలేదని టిడిపి రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొ న్నారు. రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డిని దుంపలగట్లులో పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. వారు పోలీసుల కళ్లు కప్పి మండలకేంద్రమైన ఖాజీపేట గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. చాపాడు : ప్రజాస్వామ్యాన్ని వైసిపి ఖూనీ చేస్తోందని మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా పుట్టా మైదుకూరులో శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని ప్రొద్దుటూరులోని ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత చిన్నాన్నను చంపిన వారిని అయిదేళ్లయినా అరెస్టు చేయకుండా వెంట బెట్టుకుని సిఎం జగన్‌ తిరుగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ధనపాల జగన్‌, దాసరి బాబు, అన్నవరం సుధాకర్‌రెడ్డి, రవీంద్ర, కొండపల్లి ఉమాకాంత్‌, ప్రభాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాయబ్‌ రసూల్‌, సలీం, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు. మండల పరిధిలోని టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మలమడుగు రూరల్‌ : వైసిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే అరెస్టు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదని జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, దేవగుడి యూత్‌ నాగేశ్వరరెడ్డి, నవనీశ్వర్‌రెడ్డి, కిరణ్‌ రాయల్‌, పొన్నతోట శ్రీను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్లస్టరు, యూనిట్‌, మండల, గ్రామ, వార్డు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. పులివెందుల రూరల్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని టిడిపి మాజీ పట్టణ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, మహబూబ్‌ బాషా, పార్టీ పట్టణాధ్యక్షుడు అన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బ్రాహ్మణపల్లె రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న టిడిపి కార్యాలయం నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్‌ ర్యాలీని నిర్వ హించారు. ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్‌ ఆఫీస్‌, పాత ఆర్టీసీ బస్టాండ్‌ మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి , పూలంగళ్ల సర్కిల్‌, లక్ష్మీ థియేటర్‌, పార్నపల్లి రోడ్డు మీదుగా బైపాస్‌ రోడ్డులో ఉన్న పార్టీ ఆఫీస్‌ వరకు కొనసాగింది. ర్యాలీలో తొండూరు మండల కన్వీనర్‌ శివమోహన్‌రెడ్డి, అచ్చు గుట్టు రవితేజరెడ్డి, పుచ్చా దేశారురెడ్డి, శనివారపు భాస్కర్‌రెడ్డి ఉన్నారు. చంద్రబాబు అరెస్టుతో పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా పోలీసులు టిడిపికి చెందిన బ్రాహ్మణపల్లె వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌ బాషా, తూగుట్ల మధుసూదన్‌రెడ్డి, అక్కులుగారి విజయకుమార్‌రెడ్డి, ఉమర్‌, తరుణ్‌ కుమార్‌కు నోటీసులు అందజేశారు. ఎర్రగుంట్ల : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఎర్రగుంట్ల పట్టణ పరిధిలో శనివారం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పార్టీ జెండాలు పట్టుకొని నాలుగు రోడ్ల కూడలిలో వైసిపి డౌన్‌డౌన్‌, సిఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో టిడిపి నాయకుడు రమేష్‌రెడ్డి, సుంకర నాగేశ్వరరావు, రాజారెడ్డి, బయపు రెడ్డి, శివారెడ్డి, సంజీవరెడ్డి, సేట్‌, అబ్దుల్‌, మల్లికార్జున్‌రెడ్డి, వెంకటేష్‌, మల్లేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. చక్రాయపేట : నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మండల ఇన్‌ఛార్జి తాళ్లపల్లి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అశోక్‌, చంద్ర, శంకర్‌రెడ్డి, బాలె రామాంజులరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, పరమేశ్వర, బిటిపల్లి అమర, ఆంజనేయులు, సుబ్బరామయ్య, పూర్ణ, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, నరసింహులు, భాస్కర్‌రెడ్డి, లోమడ రవీంద్రారెడ్డి, బెల్లం వెంకటరామ, రామాంజీ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.