Jan 06,2023 00:00

నిరుపయోగంగా ఉన్న వాణిజ్య సముదాయం

ప్రజాశక్తి -మధురవాడ : జీవీఎంసీ ఐదో వార్డు పరిధిలోని మారికివలస జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో రూ. లక్షలు వెచ్చించి జీవీఎంసీ నిర్మించిన పలు సముదాయాలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మారికవలస రాజీవ్‌ గృహకల్ప కాలనీలో 2012 ఫిబ్రవరిలో రూ.73లక్షలతో వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. కొనుగోలుదారులకు అనుకూలంగా ఉన్నా వ్యాపారులకు అనుకూలంగా లేదని వీటిని లీజుకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పదేళ్లుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ సముదాయం మందుబాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ సముదాయాన్ని ఆధునీకరించి నెలవారీ అద్దెల రూపంలో చిల్లర వర్తకులకు, కూరగాయల చిరువ్యాపారులకు కేటాయిస్తే జీవీఎంసీకి ఆదాయం రావడమే కాకుండా చిరు వర్తకులకు, కొనుగోలుదారులకు ఉపయోగంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.