ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
సిపిఎస్ రద్దు కోసం సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో ముఖ్యమంత్రి నివాసం కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ముందస్తుగా పోలీసు స్టేషన్కు రమ్మంటూ వేళాపాలా లేని సమయంలో పిలిచి వేధిస్తున్నారు. అలాగే కార్లు, మోటార్ సైకిళ్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్లో ఉంచుకుంటున్నారు. శనివారం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప, యుటిఎఫ్ బృందం పట్టణ సిఐ మధుసూదన్ రావుతో చర్చలు జరిపారు. తాము యుటిఎఫ్గా కానీ, ఫ్యాప్టోగా గానీ 'చలో'కు పిలుపు ఇవ్వలేదని, యుటిఎఫ్గా, ఫ్యాప్టోగా సిపిఎస్ అమలు చేసిన దినాన్ని విద్రోహ దినంగా పాటిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నట్లు వివరించారు. వాహనాలను విడుదల చేయాలని, తాము చలోకు వెళ్లకుండా ఇలా నిర్బంధించడం తగదని వారు పేర్కొన్నారు. యుటిఎఫ్ నాయకులు దావీదు, ఎం.నాగరాజు, మార్తా, నరసింహులు, రాఘవేంద్ర, రామాంజనేయులు పాల్గొన్నారు.
ఆదోనిరూరల్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. సిపిఎస్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సెప్టెంబర్ 1న చలో విజయవాడ, తాడేపల్లిలో సిఎం జగన్మోహన్రెడ్డి ఇల్లు ముట్టడికి ఎపిసిపిఎస్ఇఎ, ఎపిసిపిఎస్ఇఎస్ పిలుపునిచ్చింది. యుటిఎఫ్ నాయకులు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్లి మరీ నోటీసు ఇవ్వడం, వ్యక్తిగత వాహనాలు సీజ్ చేయడం, ఉద్యోగులు ఎక్కడున్నా లొకేషన్లో పోలీసు స్టేషన్లకు పంపించాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని యుటిఎఫ్ మండల సీనియర్ నాయకులు గాది లింగప్ప, నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదోని : పట్టణంలోని రెవెన్యూ, ఎన్జిఒస్, హెల్త్, అగ్రికల్చర్ ఇతర ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఆదోని ఆర్డిఒ కార్యాలయ ఆవరణ వద్ద పోలీసులు నిఘా పెంచారు. విధులకు హాజరైన రెవెన్యూ ఉద్యోగుల వివరాలు సేకరిస్తూ వారి వాహనాలను, బైకులను పోలీసులు ముందస్తుగా స్వాధీనం పరచుకోవడం పట్ల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు. తాము ఆందోళనకు వెళ్లేది లేదని డిక్లరేషన్ ఇచ్చినా పోలీసులు సతాయించడం సమంజసం కాదని వాపోయారు. రాత్రి వేళలో దొంగల మాదిరిగా తమను చూడడం పట్ల కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఎస్టియు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వీరచంద్ర యాదవ్ను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగులను పోలీసు స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడం, నోటీసులు జారీ చేయడం, ఎక్కడున్నది లొకేషన్లు షేర్ చేయాలనడం, రాత్రిళ్లు ఇంటి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.
పట్టణ సిఐ మధుసూదన్ రావుతో చర్చిస్తున్న యుటిఎఫ్ నాయకులు