ప్రజాశక్తి-చీరాల: విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ మృతికి కారకులైన నిందితులను తక్షణమే ప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో హత్యకు గురైన ఉప్పాల అమర్నాథ్ గౌడ్ హత్య కేసులో ఆ కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్లకార్డులను చేతబూని నిరసనను తెలియజేశారు. టిడిపి బీసీ సెల్ జోనల్-3 సమన్వయకర్త తమ్మిశెట్టి రమాదేవి, బాపట్ల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కౌతరపు జనార్ధన్ రావు, పట్టణాధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. హత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుపై సక్రమంగా పట్టించుకోకపోవటం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో గంజి పురుపోత్తం, పులిమి శివకోటి మోహనకృష్ణ, తేలప్రోలు నాగేశ్వరరావు, అడ్డగడ రామయ్య, పులిపాటి శేఖర్, శివనాగమల్లేశ్వరి, లావేటి శ్రీనివాసతేజ, దగ్గుబాటి వెంకట్రావు, తేలప్రోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










