ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు పట్టణంలోని నిమ్మ మార్కెట్ యార్డ్లో మంగళవారం నిమ్మ తోటల సస్యరక్షణ పై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఐఒ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ నిమ్మ తోటల చీడ పీడల నివారణ, నిమ్మ తోటల్లో డ్రిప్ ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. నిమ్మ తోటలకు వచ్చే తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి వాటికి సంబంధించిన మందులను పిచికారి చేయాలన్నారు. డ్రిప్పు ఎరువుల యాజమాన్యం గురించి ప్రతి నిమ్మ రైతు తెలుసుకోవాలన్నారు. డిహెచ్ఓ సుబ్బారెడ్డి, పొదలకూరు ఉద్యాన శాఖ హెచ్ ఓ ఈటెల ఆనంద్, సైంటిస్టులు శ్రీనివాసరెడ్డి, మధుమతి, పొదలకూరు జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, మండల వైఎస్ఆర్ పార్టీ మండలం కన్వీనర్ పి. రమణారెడ్డి లు పాల్గొని నిమ్మ పంటలకు వచ్చే చీడ పీడలు, వాటి నివారణ గురించి మాట్లాడారు.










