Jun 26,2023 01:02

ర్యాలీలో పాల్గొన్న కార్మికులు సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - మేడికొండూరు : తమ సమస్యల పరిష్కారం కోసం నికో ఆగ్రో కంపెనీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పేరేచర్ల సెంటర్‌లో ఆదివారం రాత్రి నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్ర కలిగిన నికో ఆగ్రో కంపెనీలో కార్మికులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, క్యాంటీన్‌, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పించలేకపోవడం యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెంచే విషయంలో యాజమాన్యం చిన్నచూపు చూడటం సరికాదన్నారు. సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న కక్ష్య సాధింపు ధోరణులు మానుకోవాలని, తక్షణమే కార్మికులను తొలగిస్తూ ఇచ్చిన లేఖలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంక్రిమెంట్‌లు పెంచాలన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికులతో చర్చలు జరపకుంటే 26వ తారీకు తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిరసనకు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మద్దతు తెలిపారు. సిఐటియు సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌ఎం బాష, నాయకులు బి.రామకృష్ణ, అవాజ్‌ నాయకులు ఎమ్‌డి సాధిక్‌, యూనియన్‌ నాయకులు పి.సుధాకర్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్లా, మీరాసాహెబ్‌, రహంతుల్లా, జాన్‌పీరా, వెంకటేశ్వర్లు, రవిచంద్రరెడ్డి, డి.విజరుబాబు, రాంబాబు, ఎం.వెంకటేష్‌, వి.సాంబశివరావు, ఆర్‌.మహేష్‌, చలపతి కె.శ్రీనివాసరావు, షేక్‌.బాజీ, ఆర్‌.రాజేష్‌, పాల్గొన్నారు.