నగరపాలక సంస్థ దుకాణాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎమ్మెస్సార్ కాంప్లెక్స్ వద్దనున్న ఖాళీ స్థలంలో నిర్మించిన ఏడు తాత్కాలిక దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. నగర కమిషనర్ జె.అరుణ ఆధ్వర్యంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఆర్వో గోపాలకష్ణ వర్మ, రెవెన్యూ అధికారులు దుకాణాలను సీజ్ చేశారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఎమ్మెస్సార్ కాంప్లెక్స్ వద్దన్న ఖాళీ స్థలంలో మూడు సంవత్సరాల పాటు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి 2016లో లీజుకి ఇవ్వడం జరిగిందన్నారు. 2019లో దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై లీజుదారులు రాష్ట్ర హైకోర్టులో దావా వేశారని, 5.9.2023న లీజుదారులు వేసిన దావాను హైకోర్టు డిస్మిస్ చేయడంతో నగరపాలక సంస్థ అధికారులు తత్కాలికంగా నిర్మించిన దుకాణాలను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.










