ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని డిప్యూటీస్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ఆటోస్టాండ్ నుండి ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కోలగట్ల పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కుశల ప్రశ్నలు వేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజాస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్ మాట్లాడుతూ వైయస్సార్ నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. వైయస్సార్ నగర్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లయా యాదవ్, సహాయ కమిషనర్ ప్రసాదరావు,స్థానిక కార్పొరేటర్ పట్టా ఆదిలక్ష్మి, వైసిపి నాయకులు తోనంగి జగన్నాథరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. నగర పాలక సంస్థ శానిటరీ విభాగంలో కోడూరు లోకేష్, తుపాకుల వెంకటరావుకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ, సంబంధిత పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. ఇద్దరికీ పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఒ శ్రీరామ్మూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.










