పైడితల్లి అమ్మవారికి దండాలు పెడుతూ నిరసన తెలుపుతున్న నిర్వాసితులు
ప్రజాశక్తి- రాంబిల్లి
నేవల్ బేస్ నిర్వాసితుల సమస్యలపై ఎనిమిది గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన మంగళవారం నాటికి 23వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరం పక్కనే ఉన్న పైడమ్మ తల్లి ఆలయం వద్ద నిర్వాసితులు పెద్ద ఎత్తున దండాలు పెడుతూ వినూత్న నిరసన తెలిపారు. 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు పట్టించుకోలేదని, మీరైనా మా సమస్యల పరిష్కారానికి దారి చూపాలని దండాలు పెడుతూ వేడుకున్నారు. ఈ ధర్నా శిబిరానికి టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తరఫున పార్టీ మండల అధ్యక్షులు దిన్బాబు రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు నిర్వాసితులు, పెద్దలు పాల్గొన్నారు.










