మాట్లాడుతున్న డాక్టర్ ఎం.శార్వాణి
నేత్రదానంతో అంధులకు వెలుగునిద్దాం
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడం ద్వారా చీకట్లో మగ్గుతున్న అంధులకు వెలుగునిద్దామని జిల్లా అందత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డా.శార్వాణి పిలుపునిచ్చారు.38 వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సందర్భముగా జిల్లా అందత్వ నివారణ సంస్థ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం వేదాయపాలెం లోని సుస్మిత నర్సింగ్ స్కూల్ నందు నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి మరణించి కూడా ఇద్దరు జీవితాలకు వెలుగును పంచే మహత్తర పుణ్య కార్యక్రమం నేత్రదానమన్నారు. నేత్రదానాన్ని ప్రతి ఒక్కరు తమ కుటుంబ సాంప్రదాయంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెట్నెల్ మేనేజర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి మరణానంతరం మాత్రమే నేత్రదానం చేయవలసి ఉంటుందని, మరణం సంభవించిన ఆరు లేదా ఎనిమిది గంటల్లోపు నేత్రదానం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. చిన్నా, పెద్ద, ఆడా, మగ ఏ వయసు వారైనా, కంటి అద్దాలు ధరించే వారైనా, మధుమేహం, అధిక రక్తపోటు కలవారైనా మరణానంతరం తన నేత్రాలను దానం చేయవచ్చున్నారు. పి.యం.పి గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ ఒక మనిషి చేసే నేత్రదానము ఇద్దరు అంధులకు దష్టిని ప్రసాదిస్తుందని. ఎవరైనా మరణానంతరం తమ కళ్ళను దానం చేయడానికి వాగ్దానం చేయవచ్చని, వీరు వాగ్దాన పత్రం ఇచ్చియున్నాను నేత్రదానానికి సమీప బంధువు ఆమోదం తప్పనిసరి అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లికార్జున, ఐ డొనేషన్ మోటివేటర్ బాలాజీ, పి.హెచ్.పి జిల్లా నాయకులు శాఖవరపు వేణుగోపాల్, జి.శేషయ్య డి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు










