Apr 14,2023 22:50

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున
ప్రజాశక్తి-విజయవాడ :
నేటి యువతకు అంబేద్కర్‌ ఆదర్శనీయుడని, ఆయన ఆశయ సాధన నేటి యువతకు ఆదర్శంకావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కర్‌ 132వ రాష్ట్ర స్థాయి జయంతి మహౌత్సవాలు విజయవా డలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శుక్రవారం వేడుకగా నిర్వహించారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో భాగంగా కళాక్షేత్రం ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ జయంతి మహౌత్సవ వేడుకల సభకు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, ప్రణాళికా సంఘ వైస్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణువర్ధన్‌ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథిగా హజరైన మేరుగు నాగార్జున మాట్లాడుతూ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ నాటి సమాజంలో నెలకొన్న అస్పశ్యతపై పోరాడిన దీరోధాత్తు డన్నారు. భారత దేశంలోని ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందంటే దానికి కారణం నాడు అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అడ్వైజర్‌, సోషల్‌ జస్టిస్‌ జూపూడి ప్రభాకరరావు మాట్లాడారు. మాదిగ వెల్ఫేర్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మూరి కనకారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత కత్తి పద్మారావు రచనలకు ప్రోత్సాహకంగా మంత్రి మేరుగు నాగార్జున రూ. లక్ష చెక్కును కత్తి పద్మారావుకు అందచేశారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఛైర్‌ పర్సన్‌ రాయన భాగ్యలక్ష్మీ, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌ లు, అధికారులు వడ్డాది మధుసూధనరావు, పి. గౌతమ్‌ రెడ్డి, తోలేటి శ్రీకాంత్‌, కూరపాటి గీతాంజలి దేవి, బండి శివశక్తి పుణ్యశీల, అడపా శేషగిరి, టి. జమల పూర్ణమ్మ, సంపత్‌ విజాత, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పోరేషన్ల సమన్వయకర్త పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మీ , డైరక్టర్‌ హర్షవర్ధన్‌, ఎన్‌. టీ. ఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.