ఘనంగా బాలల దినోత్సవం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ నేటితరం బాలలే రేపటి పౌరులని, విద్యలో అగ్రగామిగా నిలవాలని, ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి కె.చక్రవర్తి, ఎఆర్ అదనపు ఎస్పి ఎస్ఎస్.శేఖర్, ఎఆర్ డిఎస్పి కృష్ణంరాజు, ఎఆర్ ఆర్ ఎస్ఐ నరేంద్ర పాల్గొన్నారు.
ఏలూరు టౌన్ : స్థానిక ఆర్ఆర్ పేటలోని ఈదర సుబ్బమ్మదేవి స్కూలు ఆవరణలో బాలల దినోత్సవం ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ుుఖ్య అతిథులుగా శ్రీరామ్ చంద్ర ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ పూర్వ విద్యార్థి మురళీధర్ పండిట్ జవహరలాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుబ్బమ్మ దేవి పూర్వ విద్యార్థులు పాఠశాలకు వాటర్ ప్లాంట్, వాల్ గేటు, ఎలక్ట్రానిక్ బెల్లు అందించారు. తొలుత ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పిచ్చుక ఆదిశేషు గీతాలను ఆలపించారు. ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జివి ఎల్.నరసింహరావు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
చింతలపూడి : నేటిబాలలే, రేపటి పౌరులు అని చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. పట్టణంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో పట్టుదల ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధరరావు, ఎంపిపి రాంబాబు, జెడ్పిటిసి సభ్యులు మోలుగుమాటి నీరజసుధాకర్, ఎఎంసి ఛైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, మిర్యాల దిలిప్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : స్థానిక విద్యావికాస్ ప్రాంగణంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఆటల పోటీలు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్ పి.సతీష్చంద్, కరస్పాండెంట్ వి.శ్రీనివాస్, ప్రిన్సిపల్ వి.ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి.లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
నూజివీడు : భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నూజివీడు పట్టణంలోని ఎస్ఆర్ఆర్ బార్సు హైస్కూలు ఆవరణంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన ప్రధానో పాధ్యా యులు డాక్టర్ భాగవతుల హేమలత మాట్లాడుతూ ఈనాటి చిన్నారులే రేపటి భావిభారత పౌరులన్నారు. ఉపాధ్యాయ బృందం సహకారంతో విద్యార్థులకు ప్రత్యేకంగా పౌష్టికాహారం తయారు చేసి అందించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు,,కేకులు పంపిణీ చేశారు.
చాట్రాయి : జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గోలి సత్యనారాయణరెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు చంటిబాబు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : బాలల దినోత్సవ వేడుకలను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సూరవరం, తోటపల్లి ఎంపియుపి పాఠశాలల్లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూరవరం సర్పంచి జి.వీరవెంకటేశ్వరరావు, ఇండేన్ గ్యాస్ అధినేత పి.శ్రీనివాసరావు, ప్రధానోపాద్యాయులు కె.ఆనంద్కుమార్, ఆగిరిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత పాల్గొన్నారు.










