ప్రజాశక్తి-చీరాల: నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో సమితి ప్రతినిధులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఒకటో పట్టణ సిఐ మల్లికార్జునరావు అన్నారు. శనివారం నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు రిక్షా కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో నేతాజీ సేవా సమితిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని కలిగి ఉండి పేదలకు తమవంతు సాయం అందించినప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఆ దిశగా అందరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముందుగా చిన్న రథం సెంటర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు చుండూరు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి పవని భానుచంద్రమూర్తి, సత్యనారాయణ, హరిహరరావు, నాగేశ్వరరావు, నరేష్, అన్నమరాజు, సుబ్బారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










