ప్లెక్సీలు ఏర్పాటు చేసిన దృశ్యం
నేడు భ.ని.కా ర్యాలీ..బహిరంగ సభ
ప్రజాశక్తి-నెల్లూరు:ఈ నెల 15,16,17 తేదిలల్లో నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆలిండియా కౌన్సిల్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నేడు నగరంలో నిర్వహించ తలపెట్టిన భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ర్యాలీ, బహిరంగ సభలకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, సిఐటియు రూరల్ ప్రధాన కార్యదర్శి కిన్నెర కుమార్లు పిలుపు నిచ్చారు. ఈ మేరకు బుధవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో జరగనున్న సిఐటియు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆలిండియా కౌన్సిల్ సమావేశాలకు ఈ సభలో సిఐటియు అఖిలభారత అధ్యక్షులు హేమలత , అఖిలభారత కోశాధికారి సాయిబాబు , మన రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, ఇతర జాతీయ ,రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. వీరితోపాటు 29 రాష్ట్రాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా నాయకులందరూ ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మహా ప్రదర్శన విఆర్సి గ్రౌండ్ నుంచి నేటి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద జరుగు పెద్ద బహిరంగ సభ వద్దకు చేరుకుంటుందన్నారు.రూరల్ పరిధిలోని మన సిఐటియు అనుబంధ సంఘాల కార్మిక నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, రూరల్ ప్రజాసంఘాలైన మహిళా సంఘం, డివైఎఫ్ఐ ,ఎస్ఎఫ్ఐ, ఆవాజ్ ,మధ్యతరగతి తదితర రంగాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకోవాలని పిలుపు నిచ్చారు. సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు ,శాఖా కార్యదర్శులు ,శాఖ సభ్యులు, అన్ని ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇది భవన నిర్మాణ సంఘం మీటింగులే అని అనుకోకుండా ఇప్పుడున్న రాష్ట్ర జాతీయ పరిస్థితుల్లో మన వాణిని ఈ వేదిక నుంచి వినిపించే సందర్భం కనుక అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపు నిచ్చారు.










