Jun 13,2023 20:17

ఫిర్యాదు చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో సుమారు నాలుగేళ్ల నుంచి కట్టి ఉన్న రెండు ఫ్లెక్సీల అనుమతి, చలానా రుసుం వివరాలను ఆదోని మున్సిపాలిటీ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా కోరనున్నట్లు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ.నూర్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. శ్రీనివాస భవన్‌పై ఉన్న ధరణీధర్‌ రెడ్డి 30 అడుగుల ఎత్తయిన ఫ్లెక్సీ, పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న లావణ్య బిల్డింగ్‌పై ఉన్న మనోజ్‌ రెడ్డి 30 అడుగుల ఎత్తయిన ఫ్లెక్సీ దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఇతరుల ఫ్లెక్సీలను రెండు, మూడు రోజులకే తొలగించే మున్సిపల్‌ అధికారులు నాలుగేళ్ల నుంచి పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ రెండు ఫ్లెక్సీలను ఎందుకు వదిలేశారో ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ విషయంపై అధికారులు ఇచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. చట్టం అందరికీ సామానంగా పని చేసేలా చూడడమే అభ్యుదయ వాదుల తాపత్రయమన్నారు. నాయకులు సయ్యద్‌ వసీమ్‌ సాహెబ్‌, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు శాంత కుమార్‌ పాల్గొన్నారు.