Oct 10,2023 00:35

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు : జిల్లాలో రెండవ విడతలో మంజూరు చేసిన మన బడి నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్‌ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులతో సోమవారం మనబడి నాడు నేడు రెండవ విడత పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా అందుబాటులో ఉన్న నిధులపై ఎంఇలను అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనులకు నిధుల కొరత లేదని, జాప్యం చేయకుండా పనులు చేయాలన్నారు. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పనులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పాఠశాలలకు తాగునీటి, ఇతర మౌలిక సదుపాయాల పనులు నిర్దిష్టమైన సమయాలనికి పూర్తి చేయాలని చెప్పారు. అంగన్వాడీల భవన నిర్మాణాలకు నిధులకు కేటాయించిన ఉత్తర్వుల మేరకు నిధులు బదలాయించాలని చెప్పారు. బ్యాంకుఖాతాలలో ఉన్న నిధులపై ఆరా తీసారు. 10,11 తేదీలలో సచివాలయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు మన బడి నాడు పనులను పర్యవేక్షించి పనుల పురోగతిపై ఎంఇఓలకు నివేధించాలని సూచించారు. వచ్చే సోమవారం సమీక్షిస్తానన్నారు.
పాఠశాలల వారీగా డ్రాపౌట్ల విద్యార్ధుల వివరాలు ఇవ్వని విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. భవనాలు లేని పాఠశాలలు, కొత్త పాఠశాలలు ఎన్ని అవసరం ఉందో పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. చైల్డ్‌ ఇన్ఫో వెబ్‌ సైట్లో ఉన్న విద్యార్ధుల వివరాలకు, వాస్తవానికి ఎంత మంది విద్యార్ధలు ఉన్నారు, వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు విధిగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి.గౌరీ శంకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డి.వి.ఆర్‌.ఎం. రాజు, సమగ్ర శిక్ష ఎపిఓ ఎస్‌.ఎల్‌.ఎన్‌ పాత్రుడు, మండల విద్యాశాఖాధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, మండల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.