Nov 10,2022 22:52

 ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు
ప్రజాశక్తి-విజయవాడ

నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రభుత్వం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయల్లో ప్రతి ఒక్క రూపాయి ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు అధికారులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి. రాజశేఖర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి ఎస్‌ ఢిల్లీరావు పాల్గొన్నారు. జిల్లాలో నాడు-నేడు పనుల ప్రగతిని కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి. రాజశేఖర్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు నాడు-నేడు అధికారులకు తగు ఆదేశాలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా అభివృద్ధి చేయాడానికి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారని, దీనిలో ప్రతి ఒక్క రూపాయలు ఖర్చుపెట్టి పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయల ఏర్పాటుకు పనిచేయవలసిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. నిధులకు కొరత లేదని, ఇసుక, సిమెంట్‌, ఐరన్‌, కంకర, అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని చొట్ల ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని క్షేత్రస్ధాయిలో అలసత్వం వహిస్తే క్షేత్ర స్థాయి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిణి సివి రేణుకను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. సమావేశంలో డిఇవో సివి రేణుక, విద్యాశాఖ, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు