Oct 07,2023 06:32

తొంభై ఎనిమిదేళ్ళ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మరణం వేలాదిమంది సాధారణ ప్రజల దు:ఖానికి దారితీసింది. వారిలో ఎక్కువమంది గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ పంటలు, పశుపోషణ, అటవీ సంపద, మత్స్య సంపద సృష్టిలో నిమగమై ఉన్న పేదలే. శోక సంద్రంలో మునిగిన పేదలలో మహిళలే అధిక శాతంగా ఉన్నారు. శాస్త్ర, విజ్ఞాన, మేధో రంగాలకు చెందిన అనేక మంది ఆయన లేని లోటును పూడ్చలేని నష్టంగా భావిస్తున్నారు. ప్రింట్‌, టెలివిజన్‌, డిజిటల్‌ మీడియాలో ఆయన గురించి చేస్తున్న వ్యాఖ్యానాలు, ఇస్తున్న సమాచారం తక్కువైనప్పటికీ, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ప్రొ.స్వామినాథన్‌ చేసిన విశిష్ట సేవలను దాదాపు అందరూ ఏకరీతిన ప్రశంసించారు.
అనేక క్షేత్రాలలో ఎం.ఎస్‌.స్వామినాథన్‌ విశేషమైన సామర్థ్యాలకు వాస్తవంగా ఇదొక సాక్ష్యం. ఆయన తన జ్ఞానానికి మించిన శాస్త్రీయమైన రచనలు ఎన్నో చేశారు. అంతే కాకుండా, తను చేపట్టిన పనికి విధానాలతో పాటు సాంకేతికతను కూడా అనుసంధానం చేశారు. శాస్త్ర ఆధారిత వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో అద్భుతమైన కృషి చేసిన ఆయన...సంస్థలను నిర్మించడం లోను, నిర్మించడానికి సహాయం చేయడంలోనూ అద్భుతమైన పాత్ర పోషించారు. అంతేకాక శాస్త్రవేత్తలు, రైతులు ఒక్కచోటకు చేరి పరస్పరం నేర్చుకోవడానికి స్థలాన్ని కూడా సమకూర్చారు. విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర అట్టడుగు అభివృద్ధి కార్యకర్తలతో నిత్యం సంబంధాలు కలిగి ఉన్నారు.
ఎం.ఎస్‌.స్వామినాథన్‌ వ్యవసాయ శాస్త్రాలకు అందించిన సేవలు అనేకం మీడియాలో ప్రసారమైన నివాళుల ద్వారా బయటకు వచ్చాయి. ఆయనను ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసించారు. భారత దేశంలో, ప్రపంచంలో ఆకలిని నిర్మూలించాలన్న లక్ష్యానికి ఆయన కట్టుబడి ఉన్నారు. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎం.ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఎఫ్‌)లో 2005లో చేసిన చక్కటి ప్రసంగంలో పరిశోధనా పరిణామంతోపాటు అందరికీ ఆహారం, అందరికీ పోషకాహార భద్రతా విధానంపై ఒక స్పష్టమైన దృష్టికోణాన్ని వెల్లడించారు. జనాభా పెరుగుదల రేట్లు, ఆహారోత్పత్తి మధ్య సమతుల్యత నిర్వహణలో 1960ల హరిత విప్లవం ఆశాజనకమైన సందేశాన్ని అందించిందని ఆయన అన్నారు. 1960వ దశాబ్దం మధ్య కాలం నుండి చివరి వరకు శాస్త్ర విజ్ఞానానికి, వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ...భారత దేశంలో శాస్త్ర విజ్ఞానం, సాంకేతికత, ప్రభుత్వ విధానాలకు మధ్య ఉండే సమన్వయానికి హరిత విప్లవం ఒక ఉదాహరణ అని స్వామినాథన్‌ పేర్కొన్నారు. వరిలో హరిత విప్లవానికి చైనా పుట్టినిల్లు అని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రమంలో తీవ్రమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను గుర్తించినప్పటికీ, ఆయన దృష్టిలో శాస్త్ర విజ్ఞానం, దాని సామాజిక అన్వయింపులే ప్రాథమికమైనవి.
1968 తొలి నాళ్ళలో తక్కువ భూమిలో లేదా తక్కువ ఖర్చుతో, సాధ్యమైనంత ఎక్కువ దిగుబడిని సాధించాలనే లక్ష్యంతో చేసిన వ్యవసాయానికి సంబంధించిన పర్యావరణ సమస్యల తీవ్రత గురించి 'ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌'లో చేసిన ప్రసంగంలో స్వామినాథన్‌ హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం అంటే 1990లో ''సతత హరిత విప్లవం'' అనే భావనపై ఆయన ఇలా చెప్పారు: 'కొద్దిపాటి సాగుభూమి, వనరులు సరిగా లేని రైతులున్న దేశాలకు, పర్యావరణ లేదా సామాజిక ప్రమాదం లేకుండా శాశ్వతమైన ఉత్పాదక పెరుగుదల అవసరం. హరిత విప్లవం అనేది పర్యావరణ, ఆర్థిక సూత్రాలు, సామాజిక, లింగ సమానత్వ సూత్రాలలో పాతుకుపోయిన సతత హరిత విప్లవంగా మారాలి.'' సుస్థిర వ్యవసాయంలో తలెత్తుతున్న సవాళ్ల గురించి 2005లో చేసిన ప్రసంగంలో స్వామినాథన్‌ ఇలా అన్నారు: ''హరిత విప్లవం నుండి సతత హరిత విప్లవ మార్పుకు అవసరమైన నమూనా సూత్రాన్ని సాధించడంలోని మన సామర్థ్యం, భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌), సముద్ర మట్టం పెరుగుదల సవాళ్ళను ఎదుర్కోవడంలోని మన సామర్థ్యాలు... సేంద్రియ వ్యవసాయం, నూతన జన్యు శాస్త్రాల మధ్య సామరస్యాన్ని ఏర్పరచే మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. సరిహద్దు సాంకేతికతలలో నాణ్యమైన వాటిని ఉపయోగించడం ద్వారా, వాటిని పర్యావరణ విజ్ఞానం గల మన ఉన్నతమైన వారసత్వంతో కలపడం ద్వారానే ఆ విధమైన సవాల్‌ను ఎదుర్కొనవచ్చు. సతత హరిత విప్లవం కోసం అవసరమైన పర్యావరణ సాంకేతికతలు, మన భవిష్యత్‌ వ్యవసాయాన్ని రూపొందించడానికి అవసరమైన మన వ్యూహానికి దిగువ రేఖగా ఉండాలి.''
వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు (ఎం.ఎస్‌.పి) సంబంధించి, స్వామినాథన్‌ అధ్యక్షతన ఏర్పాటైన 'నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫార్మర్స్‌' చేసిన ముఖ్యమైన సిఫార్సుల చుట్టూనే 2005 నుండి ఒక బహిరంగ చర్చ నడుస్తోంది. కనీస మద్దతు ధరపై స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేయాలని...ఐదు వందలకు పైగా రైతు సంఘాల భాగస్వామ్యంతో ఏర్పడిన సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకత్వాన నడిచిన చారిత్రాత్మక రైతు ఉద్యమం డిమాండ్‌ చేసింది. వారి ప్రధానమైన డిమాండ్లలో ఎం.ఎస్‌.పి కూడా ఒకటి. నేడు, స్వామినాథన్‌ రూపొందించిన కనీస మద్దతు ధర ఫార్ములా, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతుల వద్దకు చేరి, వారి కుటుంబాల్లో ప్రతిధ్వనిస్తున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద రైతు చట్టాలను...చారిత్రాత్మక రైతాంగ పోరాటం కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. రైతులు సాధించిన గొప్ప విజయమిది.
వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పురోగతికి, అంతే సమానంగా విధాన నిర్ణయాలకు స్వామినాథన్‌ అపారమైన సహాయ సహకారాల్ని అందించారు. ఆయన ముందుండి నడిపించిన హరిత విప్లవం శాస్త్ర విజ్ఞానంలో లోతుగా పాతుకుపోయింది. అదలా కొనసాగుతూనే ఉండాలి. హరిత విప్లవం, సతత హరిత విప్లవాలకు అవతల, కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తికి మాత్రమే కాక ఆహార భద్రత, పోషకాహార భద్రతకు కూడా స్వామినాథన్‌ సహకారం అందించారు. ఓ దశాబ్దం క్రితం జాతీయ ఆహార భద్రతా చట్టం ఆమోదం పొందడంలో ఆయన చేసిన కృషి కీలకమైనది.
స్వామినాథన్‌ మొదటి నుంచి లింగ సమానత్వంపై కేంద్రీకరించి కృషి చేశారు. ఆయన వ్యక్తిగత లక్షణాలు ...విభిన్న సంస్థలు, నిర్మాణాలు, వ్యక్తులతో (కేవలం వ్యవసాయం కోసమే కాక, వ్యవసాయ రంగానికి చెందిన ప్రజల కోసం కూడా) పని చేసే వీలు కల్పించాయి. చివరగా, రెండు దశాబ్దాల పాటు నేను స్వయంగా పరిశీలించిన స్వామినాథన్‌ వ్యక్తిగత లక్షణాలు అత్యంత అసాధారణ మైనవి. ఆఖరి వరకూ ఆయన వాటినే శ్వాసించారు.

వ్యాసకర్త : ప్రొ|| వెంకటేష్‌ ఆత్రేయ, అభివృద్ధి ఆర్థికశాస్త్రవేత్త 
( 'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో )