Aug 05,2021 16:33

అమరావతి : ఇటీవల ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టలేదు. ఈ క్రమంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై ఎపి హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గతంలో పరిషత్‌ ఎన్నికలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌ చేసింది. అప్పట్లో ఎన్నికలకు తగిన సమయం లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్న సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఎన్నికలు రద్దు చేశారు. దీంతో ఎపి ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వానదలు విన్న తర్వాత తీర్పును తర్వాత వెల్లడించాలని నిర్ణయించింది.