Jun 09,2023 15:05
  • దేవాలయాల్లో రాజకీయ పాటలను ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 
  • తెదేపా నేతల తీరుపై మండిపడ్డ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు

ప్రజాశక్తి- తిరుపతి సిటీ : కులాలు, మతాలు, దేవాలయాలను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సరికాదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మండిపడ్డారు. గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మొగిలివారి పల్లి పంచాయతీ పర్యటనకు వెళ్లగా టీడీపీ నాయకులు దేవాలయాల్లో వివాదాస్పద రాజకీయ పాటలను ప్రదర్శించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను వెళ్లగా టిడిపికి చెందిన అగ్రకులస్తులు తనను తనతో వస్తున్న కార్యకర్తలను కులం పేరుతో దూషించి అడ్డుకోవడం దారుణం అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. దీనిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్, ఎస్పీల ద్రుష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన మొగిలివారిపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కులాలు, మతాలు చూడకుండా అందరినీ అభివ్రుద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నేత్రుత్వంలోని ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేయడంతో దళితులు అన్ని రంగాల్లో  రాణిస్తున్నారన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఎవరికీ పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కానీ, టీడీపీ నాయకులు కుల పిచ్చి ముదిరిపోయి.. కులాల అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి దేవాలయాల్లో వివాదాస్పద రాజకీయ పాటలు పెట్టే స్థాయి మీరు దిగజారిపోయారని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వ పథకాలను  ప్రజలకు చేరవేయడంలో తాను ఒక ఎమ్మెల్యేగా బాధ్యతతో  గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్తున్నానన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా వెళుతున్నాను  ఎక్కడ కూడా ఓట్లు అడగలేదని తెలిపారు. కానీ, తెదేపా నేతలు తమకు వ్యతిరేకంగా కులం పేరుతో దూషించడం, దేవాలయంలో రాజకీయ పాటలు ప్రదర్శించడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీన్ని సీఎం జగన్ ద్రుష్టికి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెదేపా నాయకుల దిగజారుడు రాజకీయం చూస్తుంటే.. వారే నిజమైన సైకోలు అనేది స్పష్టమవుతోంది అన్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో విద్వేషం చూపించడం అనేది సరికాదని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీ కులం అనేది ఉండకూడదా.. ఎస్సీలు ఎమ్మెల్యేలు కాకూడదా.. అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు వారి నాయకుడు చంద్రబాబు నేర్పించింది ఇదేనా అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా ఇలా కులాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ కులాలు, మతాలు తేడా లేకుండా అందరినీ అభివ్రుద్ధి చేస్తున్నారని.. మా నాయకుడు చెప్పేది ఒకే మాట అణగారిణ వర్గాల అభివ్రుద్దే లక్ష్యం అని అన్నారు. అలాంటి నాయకుడి మీద మీరు ఇలాంటి విద్వేష పూరిత పనులు చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దిగజారుడు పనులు మానుకోవాలని ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు టీడీపీ నేతలకు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పథకం ప్రకారమే ఎస్సీ నాయకుడినైన తనపై ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.