
ముస్లిం రచయితల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
ప్రజాశక్తి - నంద్యాల
ముస్లిం రచయితల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా ముస్లిం రచయితల సంఘం (మురసం) సమావేశం చాంద్బాడాలోని క్రాంతి రేఖ గ్రంథాలయంలో గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రచయిత షేక్ అబ్దుల్ సమద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం రచయితల సంఘం పరిచయం చేస్తూ మురసం అన్ని మతాలకు, కులాలకు, సంస్కతులకు ప్రాతినిధ్యం వహించే నిజమైన సెక్యులర్ రాజ్యం, సామాజిక, ఆర్థిక సమానత్వం కోరుకుంటుందని తెలిపారు. మహిళల హక్కుల కోసం మురసం మాట్లాడటమే కాదు వేదికలపై మహిళా ప్రాతినిధ్యం ఇస్తుందన్నారు. జిల్లా కార్యవర్గం పదవీ కాలం రెండేళ్ళు ఉంటుందని, మురసం సభ్యులు భారత రాజ్యాంగ విలువలకు, లౌకిక ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉంటారని వివరించారు. రంజాన్లో కవి సమ్మేళనం, సంకలనాలు, అబాబీల్, కథలు, వ్యాస రచన ప్రక్రియలు నిర్వహిస్తుందన్నారు. కమిటీ గౌరవ సాహితీ సలహాదారుగా ఎస్.ముర్తుజా విద్వాన్, అధ్యక్షులుగా ఎంఎండి.రఫీ, ఉపాధ్యక్షులుగా ఎస్ఎండి కరీముద్దీన్, అబ్దుల్ ఆజాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మహబూబ్ బాషా, సహాయ కార్యదర్శిగా ఎంఎండి రఫీ, కోశాధికారిగా ఎస్ఎండి ఫయాజ్తో పాటు కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులు పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాష్టికాన్ని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇజ్రాయిల్ రాజ్య కాంక్షతో మానవత్వాన్ని మరిచి చిన్నపిల్లలను సైతం పొట్టన పెట్టుకుంటుందని, ప్రపంచ జనావళి ఇజ్రాయిల్ దాడులను ఖండించాలని కోరారు.