
* 18 మంది అరెస్టు
ప్రజాశక్తి- కొత్తూరు: స్థానిక.ప్రభుత్వ కళాశాల రహదారిలో గతేడాది నుండి మురుగునీరు, వర్షపునీరు రహదారిపై పారుతుండంతో పాదచారులు, వాహనదారులు, స్థానికవాసులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్య పరిస్కారం కోసం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్కు ఫిర్యాదులు, విద్యార్థులతో రహదారి బైటాయింపు, రిలేదీక్షలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానికవాసులచే చేపట్టారు. అలాగే మురుగునీరు సమస్యతో రహదారి పక్కనున్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోకి మురుగునీరు, వర్షపునీరు వెళ్లిపోవడంతో సబ్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వసతి గృహం విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టిన బాలికల వసతి గృహంలోకి తరలించారు. అయితే మురుగునీరు సమస్య పరిష్కరించలేదు. ఇంత జరుగు తున్నా అధికారులు స్పందించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి లో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో మురుగునీరు సమస్య పరిష్కరించాలంటూ స్థానిక నివాసవాసులతో రహదారి దిగ్భ్రంధం చేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో సిఐ ఆర్ వేణుగోపాలరావు జోక్యంతో పోలీసులు ఆందోళన చేసిన వారిని బలవంతంగా జీపెక్కించి పోలీసుస్టేషన్కు తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ సంద ర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మూసివున్న ఆర్అండ్బి కల్వర్ట్ తెరిపించి మురుగునీరు సమస్య పరిష్కరించే వరకు ఆందోళనను ఉదృతం చేస్తామని, పోలీసులు అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. వైశ్యారాజు పైడిరాజు, బి.మహేష్, వాసు, రమేష్ ఉన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిర్ల ప్రసాద్, నిమ్మక అప్పన్నతో పాటు మరో 18 మందిని ఇన్ఛార్జి ఎస్ఐ నారాయణ స్వామి అరెస్టు చేసి విడుదల చేశారు.