
ప్రజాశక్తి-కనిగిరి: మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) జిల్లా కమిటీ సభ్యులు ఎస్కె ఖాదర్వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కనిగిరి పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అప్కాస్ నుంచి మినహాయించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పదో పిఆర్సి ప్రకారం రూ.20 వేల వేతనం కొనసాగించాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికులకు రూ.పది లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు అవసరమని అన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చార్లెస్, వి మార్క్, గరటయ్య, దస్తగిరి, రమణమ్మ, ఈశ్వరమ్మ, దానియేలు తదితరులు పాల్గొన్నారు.