Sep 23,2023 22:08

నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

పార్వతీపురం టౌన్‌: మున్సిపల్‌ పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక పాతబస్టాండ్‌ నుంచి నాలుగురోడ్ల కూడలి వరకూ ర్యాలీ చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చిట్ట చివరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌, ఆప్కాస్‌ విధాన కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా చొరవ చూపలేదని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్‌ విధానంలో కార్మికులుగా పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మికులందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పర్మినెంట్‌ చేయాలని, అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 21 నుండి,25 వరకు ఆందోళనలో జరుగుచున్నవని అన్నారు. కార్యక్రమంలో కార్మికసంఘ నాయకులు చీపురుపల్లి సింహాచలం, మామిడి శివ, మంగళగిరి శ్రీను, గంగరాజు, బంగారి రాజేష్‌, ఎం.మజ్జి, పి.సత్తిరాజు, పి.నరేష్‌, పి.ఇప్పలమ్మ, కార్మికులు పాల్గొన్నారు.